దివంగత నేత వైఎస్‌ఆర్‌కు కుటుంబ సభ్యుల ఘన నివాళులు

Family members pay tribute to late leader YSR

అమరావతిః : నేడు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75 వ జయంతి. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వైఎస్సార్‌ ఘాట్ దగ్గర వైఎస్ జగన్‌ దంపతులు, విజయలక్ష్మి నివాళులర్పించారు.

అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.

కాగా, తండ్రి జయంతిపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘కోట్లాది కుటుంబాలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. మీ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సేవకు మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. మీ ధైర్యసాహసాలు, కఠోర శ్రమ, క్రమశిక్షణ మాకు మార్గం. మీ ఆశయాలే లక్ష్యంగా పని చేస్తాం. ప్రజల క్షేమం కోసం చివరి వరకూ కృషి చేస్తాం.’ అంటూ ట్వీట్ చేశారు.