- మరో ఫేక్ ఆఫీసర్ బాగోతం వెలుగులోకి
- మొన్న సెక్రటేరియట్ .. నేడు కమండ్ కంట్రోల్ లో భద్రతా వైఫల్యం
హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) లోకి నకిలీ కానిస్టేబుల్ ప్రవేశించడం పోలీసులను షాక్కు గురి చేసింది. జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి తాను కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు. అతను పోలీస్ అధికారిగా నటించి గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అసలు విషయం బయటపడకుండా ఉండేందుకు సీఎం సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లి వచ్చి తనను నిజమైన కానిస్టేబుల్గా నమ్మించేందుకు ప్రయత్నించాడు.

తర్వాత కొన్ని రోజుల పాటు జ్ఞాన సాయి ప్రసాద్ కనిపించకపోవడంతో మోసపోయిన గోవర్ధన్ అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్లోని CCTV ఫుటేజీని పరిశీలించారు. ఆ ఫుటేజ్లో నిందితుడి చిత్రాలు స్పష్టంగా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు వ్యవస్థలోకే నకిలీ పోలీస్ ఇలా ప్రవేశించడం, అధికారికంగా అత్యంత రక్షణ కలిగిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి ఇలా చొరబడటం పోలీసు విభాగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.