రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతి
హైదరాబాద్ : నగర ప్రజలు ఎంతగానో ఎంజాయ్ చేసే నాంపల్లి నుమాయిష్ మరో రెండు రోజులు కొనసాగనుంది. ఫిబ్రవరి 15న ఎగ్జిబిషన్ పూర్తవనుండగా.. ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్ ఉండనుందని నిర్వాహకులు ప్రకటించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం లో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించిందని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు కే నిరంజన్, కార్యదర్శి బి సురేందర్ రెడ్డి, సభ్యులు సుఖేష్ రెడ్డి, ధీరజ్ జైస్వాల్లు పేర్కొన్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను ఆయన కార్యాలయంలో కలిసి ఎగ్జిబిషన్ను ఈనెల 17వ తేదీ వరకు పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం సమర్పించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సెక్రటరీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి ప్రారంభమయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఈ సంవత్సరం మూడవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందని, దీంతో స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్ను పొడిగించాలని విన్నవించారని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు పోలీస్ శాఖ అనుమతి కోసం వినతిపత్రం సమర్పించామని కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
కాగా, 1938లో నిజాం కాలంలో మొదలైన నాంపల్లి నుమాయిష్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి సందర్శకులు, స్టాల్స్ నిర్వాహకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దేశంలోని అన్ని రకాల బ్రాండ్ ఉత్పత్తులతో పాటు, హస్తకళల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే ఫుడ్ కోర్టులు, పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేందుకు గేమ్ జోన్స్ కూడా ఉంటాయి.