ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ విజనరీ, స్పేస్ఎక్స్ (SpaceX) వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మళ్లీ తన అంగారక గ్రహ ఆశయాలను వెల్లడించారు. మానవాళిని కేవలం ఒకే గ్రహానికి పరిమితం చేయకూడదని, భవిష్యత్లో వచ్చే అనిశ్చిత విపత్తుల నుంచి మానవ నాగరికతను రక్షించేందుకు బహుళ గ్రహ జీవులుగా మారడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన “ఆక్యుపై మార్స్” (Occupy Mars) మిషన్ గురించి చర్చించారు.

స్వయం సమృద్ధి కలిగిన మానవ కాలనీ లక్ష్యం
కేవలం అంగారకుడిని సందర్శించడం మాత్రమే కాకుండా, మానవాళిని ఒక బహుళ గ్రహ జాతిగా మార్చాలన్నది తన ఆకాంక్ష అని మస్క్ పేర్కొన్నారు. “భూమికి ఏదైనా తీవ్ర విపత్తు సంభవించినా, మానవ నాగరికత కొనసాగేందుకు ఇది దోహదపడుతుంది. విశ్వం యొక్క స్వభావాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, మన ఉనికిని విస్తరించుకోవడానికి ఇది అవసరం” అని ఆయన వివరించారు. కోట్లాది సంవత్సరాల తర్వాత సూర్యుడి వల్ల భూమి నివాసయోగ్యం కాకుండా పోవచ్చని, అటువంటి పరిస్థితుల్లో అంగారకుడు మానవాళికి ఒక ‘జీవ బీమా’గా ఉపయోగపడతాడని ఆయన అభిప్రాయపడ్డారు. సూర్యుడు క్రమంగా విస్తరిస్తున్నాడని, 440 మిలియన్ సంవత్సరాలకు సూర్యుడి వేడికి భూమిపై జీవం లేకుండా పోతుందని ఆయన అంచనా వేశారు.
స్టార్షిప్ ప్రయోగాలు
తొలుత 2026 నాటికి అంగారకుడిపై మానవరహిత వ్యోమనౌకను దించాలని, ఆ తర్వాత 2030 లోపు మానవులను పంపాలని మస్క్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల తన లక్ష్యాన్ని సవరించుకున్న ఆయన, 2029 నాటికి మానవులు అరుణ గ్రహంపై అడుగుపెట్టే అవకాశం ఉందని తాజాగా వెల్లడించారు. స్టార్షిప్ వ్యోమనౌకను విశ్వసనీయంగా కక్ష్యలోకి పంపడం, దాని పునర్వినియోగాన్ని సాధించడం ప్రస్తుతం తమ ప్రథమ ప్రాధాన్యతలని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే, మానవ చరిత్రలోనే ఇది ఒక నూతన అధ్యాయనానికి నాంది పలుకుతుంది. దీనికి ముందు మానవరహిత వ్యోమనౌకను 2026 నాటికి పంపే యత్నం జరుగుతుంది. దీనిద్వారా అక్కడి వాతావరణ పరిస్థితులు, భౌగోళిక లక్షణాలు గురించి మరింత సమాచారాన్ని సేకరించనున్నారు.
Read also: Dance of the Hillary Virus: “డాన్స్ ఆఫ్ ది హిల్లరీ” వైరస్ హెచ్చరిక