తిరుపతి: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని ఎన్డీయేలోని టీడీపీ కైవసం చేసుకుంది. కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నికను మంగళవారం తిరుపతి ఎస్వీ వర్సిటీ సెనెట్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ, కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా ఎన్డీయే అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ విజయం సాధించారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లుండగా 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీటిలో 3 ఖాళీలున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నికకు 26 మంది కావాల్సి ఉండగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, తన 21 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరై డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ అభ్యర్థిగా భాస్కర్ రెడ్డిని పోటీ చేయించారు. అయితే టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

డిప్యూటీ మేయర్ ఎన్నికలో అధికార కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడవచ్చనే అనుమానంతో వైసీపీ నాయకులు ముందస్తుగా భద్రత కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎన్నికల కేంద్రం వద్ద అదనపు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా తిరుపతిలో144 సెక్షన్ అమలు చేస్తూ 30 పోలీసు యాక్టును అమలు చేసినట్లు ఎస్పీ హర్షవర్దన్రాజు తెలిపారు. గొడవలు సృష్టించేవారికి నోటీసులు అందజేశామని వివరించారు.