ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెడీ-టు-ఈట్ మరియు రెడీ-టు-హీట్ఆహార పదార్థాల వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్నది. ఈ తరహా అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF) అధికంగా తీసుకోవడం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకునే వ్యక్తుల్లో, అకాల మరణాల ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు తేలింది.

UPFలు ఏంటి? ఎందుకు ప్రమాదకరం?
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే పరిశ్రమల్లో మునుపటి సహజ ఆహార పదార్థాల రూపం పూర్తిగా మారిపోయేలా చేసిన, రసాయనిక పదార్థాలు (కృత్రిమ రంగులు, రుచులు, స్వీటెనర్లు, ప్రిజర్వేటివ్స్) మిశ్రమంగా ఉండే పదార్థాలు. సాధారణంగా ప్యాకెట్లో లభించే స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, రెడీ-మేడ్ పిజ్జా, పాస్తా, నూడుల్స్, డెజర్ట్స్ వంటి వాటిని ఈ జాబితాలోకి చేర్చవచ్చు. ఈ ఫుడ్స్లో అధికంగా ఉండే సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెరలు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం, డిప్రెషన్ వంటి 32కి పైగా ఆరోగ్య సమస్యలకు గట్టి సంబంధం కలిగి ఉన్నాయని గత అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. బ్రెజిల్లోని సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన పరిశోధకుడు ఎడ్వర్డో ఏఎఫ్ నిల్సన్ మాట్లాడుతూ, ఈ ఆహారాల తయారీలో ఉపయోగించే కృత్రిమ రంగులు, రుచులు, స్వీటెనర్లు, ఇతర సంకలనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కేవలం అధిక ఉప్పు, చక్కెర, కొవ్వుల వల్ల కలిగే నష్టమే కాకుండా, పారిశ్రామిక ప్రక్రియ కూడా హానికరం అని తెలిపారు.
ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి ఎనిమిది దేశాలలోని ప్రజల ఆహారపు అలవాట్లు, మరణాల గణాంకాలను విశ్లేషించి ఈ అధ్యయనం నిర్వహించారు. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం, వ్యక్తులు తీసుకునే మొత్తం కేలరీలలో UPFల వాటా పెరిగే కొద్దీ, వాటి వల్ల సంభవించే అకాల మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని స్పష్టమైంది.
PFల వాటా పెరిగితే – అకాల మరణాల ముప్పు ఎలా పెరుగుతుంది?
వ్యక్తులు తీసుకునే మొత్తం కేలరీలలో UPFల వాటా ప్రతి 10% పెరిగినప్పుడు, అకాల మరణాల ముప్పు 3% పెరుగుతుందని అంచనా వేశారు. కొలంబియా వంటి తక్కువ వినియోగం ఉన్న దేశాల్లో (UPF వినియోగం 15% మాత్రమే) అకాల మరణాలు 4% ఉన్నా, అమెరికా వంటి అధిక వినియోగం ఉన్న దేశాల్లో (UPF వినియోగం 50% పైగా) అకాల మరణాల శాతం దాదాపు 14% వరకు ఉందని గుర్తించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో UPF వినియోగం ఇప్పటికే పెరిగి స్థిరంగా ఉండగా, భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది వేగంగా పెరుగుతోంది. ఇది ప్రజారోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ సిద్ధమైన స్థానిక ఆహార పదార్థాలతో కూడిన సంప్రదాయ ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలని నిల్సన్ సూచించారు.
Read also: Houthi: హూతీలపై అమెరికా భారీ క్షిపణులతో దాడులు