వేసవి సెలవులంటే పిల్లలతో పాటు పెద్దలకూ ఉత్సాహంగా ఉంటుంది.ఊరికి వెళ్లడం, బంధువుల ఇళ్లలో గడపడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం వంటి కార్యక్రమాల్లో చిన్నారులు ఆసక్తిగా పాల్గొంటారు.ఈ ఆనందం వెంటే విషాదాలు పొంచి ఉంటాయి. ఈత, మోటారు సైకిల్ రైడింగ్, మండే ఎండలు చిన్నారులకు ముప్పు తెప్పిస్తాయి. చివరకు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. వేసవిలో ఎండ తాపానికి తట్టుకోలేక, సరదాగా ఈత నేర్చుకోవడానికి వెళ్లి మృతి చెందుతూ చివరకు తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. పిల్లలు పెద్దల సంరక్షణలోనే ఈత నేర్చుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. బావులు, చెరువులు, కాలువల్లో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.
ప్రధాన ప్రమాదాలు
తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశముంది.అతివేగ మోటారు సైకిల్ రైడింగ్ – సరదాగా వేగంగా మోటార్ సైకిళ్లు నడిపి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.ఈత ప్రమాదాలు – సరదాగా నీటిలో దిగిన వారు మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు.అగ్ని ప్రమాదాలు – గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది.
తాజా ఘటనలు
వేసవి ముప్పును తేలిగ్గా తీసుకోవడం వల్ల నల్గొండ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు.చిట్యాల మండలం ఏపూర్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన చింతపల్లి రాఘవేంద్ర (21), నలుపరాజు నవీన్కుమార్ (23) నీటిలో మునిగిపోయారు.తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన శీల శ్రీశైలం (23) చెరువులో పశువులను కొట్టుకొచ్చేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు.చందంపేట మండలం నక్కలగండి తాండా గ్రామంలో నీటి గుంతలో పడి రెండు సోదరులు మృతి చెందారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన లింగయ్య, అతని కొడుకు శ్రీమణికాంత్ గురుకుల ప్రవేశ పరీక్ష రాసి వస్తూ సాగర్ కాల్వలో ఈత కోసం దిగి మృతి చెందారు.ఈ ప్రమాదాలు తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నాయి.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నారులు నీటిలో ఈత కొట్టేందుకు వెళితే, పెద్దల సమక్షంలోనే ఉండేలా చూడాలి.వర్షపు గుంటలు, చెరువులు, బావుల దగ్గర పిల్లలు ఆడకుండా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి.పిల్లల ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసేందుకు పుస్తక పఠనం, క్రియేటివ్ యాక్టివిటీస్ ప్రోత్సహించాలి.వేడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తగినంత నీరు తాగేలా చూడాలి.పిల్లలు ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రులకు చెప్పేలా అలవాటు చెయ్యాలి.
పోలీసుల చర్యలు
నల్గొండ జిల్లా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ,ప్రమాదకరమైన చెరువులు, కాలువల వద్ద అవగాహన బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.యువతలో బావులు,రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను ప్రతి రోజూ పర్యవేక్షించాలి అని సూచించారు.