మంత్రి డోలాకు తప్పిన ప్రమాదం

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లారు. తిరుణాల సందర్భంగా టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన నూతన ఎడ్ల బండిని ప్రారంభిస్తుండగా డీజే సౌండ్లకు బెదిరి ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి. ఈ క్రమంలో మంత్రి స్వామి కింద పడిపోయాడు.. దీంతో.. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే.. స్థానిక నాయకులు అప్రమత్తమై తప్పించడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. అనంతరం యధావిధిగా పోలేరమ్మ తిరునాళ్ళలో పూజా కార్యక్రమాలు ముగించుకొని స్వగ్రామమైన నాయుడు పాలెం గ్రామానికి వెళ్లిపోయారు.

ఈ విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. టీడీపీ సీనియర్ నేత దామచర్ల పూర్ణచందర్రావు మంత్రి నివాసానికి వెళ్లి పరామర్శించారు. పలువురు టీడీపీ నేతలు ఫోన్‌ ద్వారా ఘటన వివరాలను తెలుసుకొని పరామర్శించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి స్వామి.