డాక్టర్ హత్యాచారం కేసు..నేడు సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక

Doctor murder case.. CBI report to Supreme Court today
Doctor murder case.. CBI report to Supreme Court today

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హత్యాచారం కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ సోమవారం సుప్రీంకోర్టు కు నివేదిక సమర్పించనుంది. ఇప్పటికీ ఆర్‌ జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది. ఆగస్టు 9వ తేదీన మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభించింది. హత్యాచారం ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. తొలుత సంజయ్ రాయ్ కోల్‌కతా పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించాడు. కానీ తాను సెమినార్ హాల్‌కు చేరుకున్నప్పటికే జూనియర్ డాక్టర్ చనిపోయినట్లు తెలిపాడు. దీంతో అభయ హత్యపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ క్రమంలో జూనియర్ డాక్టర్‌ని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సెమినార్ హాల్‌లో ఉంచారా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కోల్‌కతా రేప్ కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఈ కేసు దర్యాప్తు నివేదికను సీబీఐ కోర్టులో సమర్పించనుంది.

ఆర్ జీ కర్ వైద్య కళాశాల సెమినార్ హాల్‌లోనే అభయను హత్య చేశారా.. లేదంటే మెడికల్ కాలేజీలోని మరేదైనా గది లేదా ఫ్లోర్‌లో హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని సెమినార్ హాలుకు తీసుకువచ్చారా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పటల్‌లోని కొన్ని ఫోర్లపై సీబీఐ నిఘా పెట్టింది. ఎనిమిదో అంతస్థులోని స్పెషల్ సర్జరీ విభాగానికి చెందిన ఆపరేషన్ థియేటర్‌పై సీబీఐ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అభయ హత్యకు, ఆర్థోపెడిక్ విభాగానికి ఉన్న లింకులపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థోపెడిక్ విభాగం, చెస్ట్ మెడిసిన్ విభాగాలకు చెందిన ఫ్లోర్ మ్యాప్‌ల ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.

సెమినార్ హాల్‌లోని ఫోటోగ్రాఫ్‌లలో మృతుడి మృతదేహం, బూట్లు వంటి అనేక అంశాలు కనిపిస్తుండటంతో.. ఘటనా స్థలం సెమినార్ గదినా లేదా సంఘటన జరిగిన తర్వాత మృతదేహాన్ని ఆ గదికి తీసుకెళ్లారా అని నిర్ధారించడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ల్యాప్‌టాప్, తల, చేతులు, బెడ్ షీట్ మొదలైనవి అక్కడ అమర్చినట్లు ఉండటంతో సీబీఐ పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభయను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సెమినార్ హాల్‌లో ఉంచారా అని సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పూర్తైన దర్యాప్తు నివేదికను సీబీఐ సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ తన నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపర్చిందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.