ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. దాదాపు ప్రతీ జట్టు ఏడేసి మ్యాచ్లు ఆడాయి. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీపై విజయంతో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ముంబై ఇండియన్స్ 5, 6, 7 స్థానాల్లో ఉండగా రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు జట్లు ఏడేసి మ్యాచ్లు ఆడి రెండు విజయాలు మాత్రమే నమోదు చేసాయి. మరో ఐదు మ్యాచ్ల్లో ఓడాయి. దాంతో నాలుగేసి పాయింట్లతో 8, 9, 10 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ప్లే ఆఫ్స్ బెర్త్
ప్రతీ జట్టు 14 లీగ్ మ్యాచ్లు ఆడుతోంది. లీగ్ దశ ముగిసే సరికి పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. కనీసం 9 మ్యాచ్లు గెలిచే జట్లకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. 8 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు, నెట్రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. ఐదేసి విజయాలతో టాప్-2లో కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్లకు దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కినట్లే. ఆ జట్లు మరో 4 విజయాలు సాధిస్తే సరిపోతుంది. నాలుగేసి విజయాలతో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్కు కూడా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మూడేసి విజయాలతో ఉన్న ముంబై, కేకేఆర్ సెకండ్ ఫేజ్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలి.చివరి మూడు స్థానాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లే. అద్భుతం జరిగితే తప్పా ఈ జట్లకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు. ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ చివరి 7 మ్యాచ్లకు 7 గెలవాలి. లేదంటే మెరుగైన రన్రేట్తో కనీసం 6 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అద్భుతం జరిగితే తప్పా ఈ జట్లు వరుసగా విజయాలు సాధించలేవు. ఐపీఎల్లో 16 పాయింట్లు సాధించిన జట్లే ప్లే ఆఫ్స్ చేరుతాయి.

బ్యాటింగ్
కొన్నిసార్లు 14 పాయింట్లతో కూడా వెళ్లవచ్చు. కానీ మెరుగైన రన్రేట్తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్, సీఎస్కే రన్ రేట్ దారుణంగా ఉంది. ఈ మూడు జట్ల రన్రేట్ మైనస్లోనే ఉంది. ఈ మూడు జట్లు మరో 6 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం దక్కుతుంది. కానీ ఆ జట్ల బలహీనతల నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది.ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా హిట్టింగ్ అప్రోచ్తో మూల్యం చెల్లించుకుంటుంది. పిచ్ కండిషన్స్తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడాలనే ప్రయత్నంలో సన్రైజర్స్ బ్యాటర్లు వికెట్లు పారేసుకుంటున్నారు. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. కమిన్స్ మినహా మరే బౌలర్ ప్రభావం చూపలేకపోతున్నాడు. షమీ వైఫల్యం జట్టు కొంపముంచుతుంది.సిఎస్ కె మూడు విభాగాల్లో తడబడుతోంది. బౌలర్లు కాస్త పర్వాలేదనిపిస్తున్నా బ్యాటర్లు తేలిపోతున్నారు. గాయాల బెడద ఆ జట్టును వేధిస్తోంది. ధోనీ మినహా బిగ్ హిట్టర్స్ లేకపోవడం బలహీనంగా మారింది.రాజస్థాన్ రాయల్స్ పటిష్టంగానే ఉన్నా జట్టులో విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్ సంజూ శాంసన్, కోచ్ రాహుల్ ద్రవిడ్కు పడటం లేదని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాతావరణంలో ఆ జట్టు పుంజుకోవడం చాలా కష్టం.
Read Also:IPL 2025: ఆర్సీబీ ఓటమికి కారణాలు ఇవే!