ఉత్తరప్రదేశ్ బరేలీలో ఓ మానవతా ఘటన వెలుగుచూసింది. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ గొప్ప ధైర్యసాహసం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పాడుబడిన భవనంలో వదిలేసి వెళ్లిన పసికందును ఖుష్బూ గమనించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా గోడ దూకి చిన్నారిని రక్షించారు. గాయాలతో ఏడుస్తున్న పాపను చూసి చలించిపోయిన ఆమె, తక్షణమే ప్రథమ చికిత్స అందించి తన తండ్రి సహాయంతో ఆసుపత్రికి తరలించారు.
పాడుబడిన భవనం నుంచి పసికందు ఏడుపులు వినిపించడం
ఖుష్బూ ఆదివారం ఉదయం నడక కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పక్కనే ఉన్న పాడుబడిన భవనం నుంచి పసికందు ఏడుపులు వినిపించడంతో ఆమె తక్షణమే స్పందించారు. లోపలికి నేరుగా మార్గం లేకపోయినా ప్రహరీ దాటి వెళ్లి చిన్నారిని గుర్తించారు. పాపకు సుమారు 10 నెలల వయసుండగా, ముఖంపై గాయాలు ఉన్నట్లు తెలిపారు. తండ్రి జగదీశ్ పటానీతో కలిసి బరేలీలో నివసిస్తున్న ఖుష్బూ ప్రస్తుతం లెఫ్టినెంట్గా సాయుధ దళాల్లో సేవలందిస్తున్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామనీ, త్వరలోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సర్కిల్ ఆఫీసర్ పంకజ్ శ్రీవాస్తవ. ఖుష్బూ పటానీ చేసిన పనికి స్థానికులు, పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. ఆమె ధైర్యం, చొరవ మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.