తెలంగాణ వరద బాధితులకు నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ భారీ విరాళం

వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కోరడం తో దాతలు ముందుకు వస్తున్నారు. చిత్రసీమ తో పాటు పలు రంగాల వారు తమకు తోచిన సాయాన్ని అందజేస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫౌండ్ కు నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ భారీ సాయం అందజేశారు. దిల్ రాజు, నాగవంశీ చెరో రూ.25లక్షలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి అందించారు. అలాగే నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున నటి, నిర్మాత యార్లగడ్డ సుప్రియ రూ.50 లక్షల చెక్కును సీఎం రేవంత్ కు అందజేశారు.

ఈ సందర్బంగా ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు సీఎం ఆమెను అభినందించారు. లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ తన వంతు సాయం అందించారు. మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కు అందజేశారు.

ఇక నిర్మాణ సంస్థ మేఘా గ్రూప్ తెలంగాణకు, ఏపీకి చెరో రూ.5కోట్ల విరాళం ఇచ్చింది. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తనయుడు మహేశ్ బాబు ఫ్యాన్స్ విజయవాడ వరద బాధితుల కోసం రూ. రెండున్నర లక్షలు ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు.