భారతదేశం పై పాకిస్తాన్ చేపట్టిన ఆక్రమణాత్మక చర్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తత పాటిస్తున్నారు. ఇటీవల భారత్ నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన హద్దు దాటి దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశ్యంతో పాక్ అనేక మార్గాల్లో ప్రతిదాడులకు దిగింది.

ఢిల్లీకి హై అలెర్ట్: విమానాలు, రైళ్ల రద్దు
ఢిల్లీలోని ప్రధాన విమానాశ్రయానికి వచ్చే 90 పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్కు వెళ్లే రైళ్లు నిలిపివేయబడ్డాయి. రాజధాని ప్రాంతమంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. ఇండియా గేట్, పార్లమెంట్, విమానాశ్రయం, భవన నిర్మాణ మంత్రిత్వ శాఖ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా దళాలు భారీగా మోహరించబడ్డారు. రహదారుల పైన ప్రత్యేక తనిఖీలు, నిఘా కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతోంది.
27 విమానాశ్రయాల మూసివేత, సైనిక నియంత్రణ
27 విమానాశ్రయాల మూసివేత భారత్ పై పాకిస్తాన్ దాడుల దృష్ట్యా కిషన్గఢ్, భుంతార్, లూథియానా విమానాశ్రయా లను మూసివేశారు. దీని కంటే ముందు – రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, కాశ్మీర్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ తో సహా అనేక విమానాశ్రయాలను కూడా మూసివేశారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం ఇప్పటివరకు 46 దేశీయ విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఛండీగడ్లో దాడులు జరిగే అవకాశం సైరన్ అలెర్ట్ ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉందని వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేసింది. చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది . పంచకుల, మొహాలి, పటియాల, అంబాలాలో కూడా ఇదే విధమైన హెచ్చరికలను జారీ చేశారు.
జమ్మూ కాశ్మీర్లో పేలుళ్లు, అప్రమత్తత
ఈ ఉదయం జమ్మూ ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్టు సమాచారం. తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో ఈ పేలుళ్లు సంభవించగా, వెంటనే సైరన్లు మోగించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భద్రతా దళాలు వెంటనే స్పందించి కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటు లేదా పాక్ విమానాల చలనం కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read also: Narendra Modi: గుజరాత్ ముఖ్యమంత్రికి మోదీ ఫోన్ భద్రత చర్యలపై ఆరా