ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడి అవుతున్నా యి. బీజేపీ అధికారం ఖాయమైంది. ఆప్ ప్రముఖులు ఓటమి బాట పట్టారు. కేజ్రీవాల్ తో సహా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇప్పటికే ఓడిపోయారు. సీఎం అతిశీ విజయం దిశగా వెళ్తున్నారు. బీజేపీ ఇప్పటికే 48 సీట్లలో స్పష్టమైన ఆధిక్యతలో కొనసాగుతోంది. ఆప్ 22 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాగా, కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. ఇక, ఆప్ ముఖ్య నేతలే పరాజయం దిశగా ఉండటం తో ఆప్ క్యాంప్ లో ఒక్క సారిగా అనిశ్చితి ఏర్పడింది.

కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఊహించని విధంగా న్యూఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కు తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఆప్ అగ్రనేతలను మట్టి కరిపించింది. కేజ్రీవాల్ తో సహా ముఖ్య నేతలను ఓటర్లు చావు దెబ్బ కొట్టారు. పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో మూడు వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. అదే విధంగా లిక్కర్ కేసులో జైలు శిక్ష అనుభవించిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం ఓటమి పాలయ్యారు. జంగ్ పూర్ లో సిసోడియా పై బీజేపీ అభ్యర్ధి తర్వీందర్ సింగ్ గెలుపు సాధించారు. ఆప్ ముఖ్య నేత.. సీఎం అతిశీ కల్ కాజీ నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. మరో నేత సౌరభ్ భరద్వాజ్ వెనుకంజలో ఉన్నారు.
ఎవరీ పర్వేష్ వర్మ?
కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్ధి పర్వేష్ వర్మ దాదాపు 1200 ఓట్లతో విజయం సాధించారు. తొలి నుంచి కేజ్రీవాల్ లక్ష్యంగా పర్వేష్ దూకుడుగా వ్యవహరించారు. యమునా నది విషయంలోనూ ధీటుగా బదులిచ్చారు. సీఎం రేసులో ఉన్న పర్వేష్ ఫలితం రాగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. సానుభూతి కలిసి వస్తుందనే ఆప్ అంచనాలు తారు మారు అయ్యాయి. దీంతో, ఈ సాయంత్రం బీజేపీ కార్యాలయంలో సంబరాలకు నేతలు సిద్దం అవుతున్నారు. ప్రధాని మోదీ బీజేపీ కార్యాలయానికి రానున్నారు. వరుస పరాజయాలతో కాంగ్రెస్ చతికిలబడింది. ఇప్పుడు ఆప్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.