అశ్వారావుపేట పోలీసులను వెంటాడుతున్న వరుస విషాదాలు

అశ్వారావుపేట సర్కిల్లో వరుసగా పోలీసుల మరణాలు ఆయా కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నాయి. నాల్గు రోజుల క్రితం అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే.. దమ్మపేట పోలీస్ స్టేషన్లో రెండో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో అశ్వారావుపేట సర్కిల్ పరిధిలోని పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంలోనే గుండెపోటుకు గురికాగా.. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఎస్సై సీమా నాయక్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో వారంలోనే ఇద్దరు ఎస్సైలు ప్రాణాలు కోల్పోవటంతో పోలీసుల్లో తీవ్ర విషాదం అలముకుంది.

అశ్వారావుపేట స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది తట్టుకోలేక గత నెల 30 న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందిచగా.. అతడిని ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల పాటు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీనివాస్ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం నుండి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు మరో ఎస్సై ప్రాణాలు విడిచారు.