కాషాయ పాలనలో విచ్చలవిడిగా అవినీతి: డీకే శివకుమార్ ఆరోపణలు

dk shivakumar comments on bjp
dk shivakumar comments on bjp

బెంగళూర్‌: కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు చోటుచేసుకున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. కాషాయ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ఈ విషయాలన్నీ తాము అసెంబ్లీ ముందుంచుతామని పేర్కొన్నారు. డీకే శివకుమార్ శుక్రవారం బెంగళూర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

బీజేపీ ప్రభుత్వ హయాంలో రూ. 300 కోట్లకు పైగా విలువైన స్కామ్‌లు వెలుగుచూశాయని ఆరోపించారు. కాషాయ పాలకులకు అవినీతిలో తిరుగులేదని అన్నారు. బీజేపీ నేతల అవినీతి, కుంభకోణాలపై విచారణలు సాగుతున్నాయని, దోషులను తమ ప్రభుత్వం శిక్షిస్తుందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాగా, గత పదేండ్ల బీజేపీ హయాంలో కాషాయ పాలకులు ఏకంగా 15, 16 ప్రభుత్వాలను కుప్పకూల్చారని అంతకుముందు కర్నాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఆరోపించారు.

విపక్ష సర్కార్లను కూల్చడంతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 450 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీ విధానమే ప్రత్యర్ధి ప్రభుత్వాలను అస్ధిరపరచడమని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఇదే తంతు కొనసాగుతున్నదని అన్నారు.అవినీతి కుంభకోణాల్లో సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లు చెప్పాలని తమ అధికారులను, నేతలను బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఉపయోగిస్తామని చెప్పాలని తమ నేతలు, పార్టీ శ్రేణులపై కాషాయ పాలకులు ఒత్తిడి తెస్తున్నారని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు కాషాయ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యని దుయ్యబట్టారు. బీజేపీ ఇప్పటికీ అదే విధానాలను అనుసరిస్తోందని అన్నారు.