సైబ‌ర్ క్రైమ్ పెను స‌వాల్‌గా మారింది: కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌

Cybercrime has become a major challenge: Union Minister Nityanand Rai

హైద‌రాబాద్‌: నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌ల (IPS) గౌరవందనాన్ని కేంద్రమంత్రి స్వీకరించారు. అనంతరం కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ లకు అభినందనలు తెలియజేశారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని… దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్‌లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ”భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీ పైన ఆధారపడి ఉంది” అని అన్నారు. సైబ‌ర్ క్రైమ్ పెను స‌వాల్‌గా మారింద‌ని రాయ్ తెలిపారు.

ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలన్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉండాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ను కట్టడి చేయడానికి కృషి చేయాలన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా కేసులను తొందరగా పరిష్కరించాలని తెలిపారు. నేరస్తులను పట్టుకొని వారికి తొందరగా శిక్షలు పడేలా చూడాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కోవిడ్ టైమ్ లో పోలీసుల సేవ గొప్పది అని కొనియాడారు. భారత పోలీస్ సేవను అత్యున్నత స్థానంలో నిలబెడతారనే నమ్మకముంది అని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు.

కాగా.. నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ ఘనంగా జరిగింది. పోలిస్ అకాడమీ నుంచి 188 మంది ట్రైనీ ఐపీఎస్ లు పాస్ అవుతున్నారు. వీరిలో 54 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లు, తెలంగాణకు నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించడం జరిగింది.