ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) వందో ప్రయోగానికి సిద్ధమైంది.2024 సంవత్సరాన్ని ఒక విజయవంతంమైన మిషన్తో పూర్తి చేసిన ఇస్రో.. 2025 కొత్త ఏడాదిని కూడా మరో మైలురాయితో ప్రారంభించబోతోంది. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి వందో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు చేపట్టనున్న GSLV-F15 రాకెట్ ప్రయోగం షార్ నుంచి చేసే వందో ప్రయోగమని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి 1979 ఆగస్ట్ 10న SLV 3E -1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్ని ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం సఫలం కాలేదు. అయితే, ఆ తర్వాత జరిపిన రెండు ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. షార్ నుంచి ఇస్రో జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. విజయవంతమైన ప్రయోగాల్లో 129 స్వదేశీ ఉపగ్రహాలను, 433 విదేశీ ఉప గ్రహాలను, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలను, ఒక గగనయాన్ టెస్ట్ వెహికిల్ డీ వన్, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.
శత ప్రయోగాల షార్
2024 డిసెంబర్ చివరి వారంలో, స్పేడెక్స్ మిషన్లో భాగంగా ప్రయోగించిన PSLV C- 60 ప్రయోగ సమయంలో ఇది షార్ నుంచి చేసిన 99వ ప్రయోగమని అప్పటి ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగంలోనే ఇస్రో అంతరిక్షంలో రెండు శాటిలైట్లను డాకింగ్ చేసి, డాకింగ్ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది.శాటిలైట్ డాకింగ్ ద్వారా 2025ను కూడా సక్సెస్ ఫుల్గా ప్రారంభించిన ఇస్రో ఈ ఏడాది మొదటి నెలలోనే శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి సిద్ధమైంది.