కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తుందని బీజేపీ మండిపడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకార్థం స్థలాన్ని కేటాయించలేదంటూ కాంగ్రెస్ చేసిన తీరు సిగ్గుచేటుగా అభివర్ణించింది. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి ప్రముఖులను మాత్రమే మీడియా కవరేజ్ చేసింది అనే ఆరోపణలను బీజేపీ ఖండించింది. భద్రతా కారణాల రీత్యా మీడియా కవరేజ్ పై నియంత్రణలు ఉన్నాయని స్పష్టంచేసింది. అంత్యక్రియల నిర్వహణలో ఎలాంటి రాజకీయం జరగలేదని బీజేపీ వెల్లడించింది.
అంత్యక్రియల ప్రాంగణంలో సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను సైతం బీజేపీ ఖండించింది. ప్రోటోకాల్ ప్రకారం, మాజీ ప్రధానమంత్రి కుటుంబానికి ప్రథమ వరుసలో ఐదు కుర్చీలు కేటాయించినట్లు పేర్కొంది. కాంగ్రెస్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి మాటలు చెబుతున్నారని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించింది. మన్మోహన్ సింగ్ లాంటి మహానుభావుడి పేరును కూడా కాంగ్రెస్ రాజకీయ ప్రకటనల కోసం వాడుకోవడం సిగ్గుచేటని , ఇది కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనమని మండిపడ్డారు.