హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. బుద్ధభవన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి.. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా.. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హైడ్రా ఏర్పాటైన మొదట్లో ప్రజల నుంచి మిశ్రమ స్పందన రాగా.. ప్రస్తుతం హైడ్రా కార్యాలయానికి జనాలు క్యూ కడుతుండటం గమనార్హం. నగరంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలపై ఆయా ప్రాంతాల ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కూడా ఫిర్యాదు రావటం గమనార్హం.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. సందర్భంగా వైసీపీకి చెందిన ఓ మహిళా నేత.. మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ అమీన్పూర్లోని 193 సర్వే నంబర్లో ఉన్న తన భూమిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, రమేష్ అనే వ్యక్తి.. ఇద్దరు కలిసి కబ్జా చేశారని బాధితురాలు హైడ్రా కమిషనర్కు కంప్లైంట్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే కబ్జాకు గురైన తమ లేఅవుట్ ప్లాట్లు, రోడ్లు విడుదల అయ్యాయని.. కానీ ఇంకా చాలా ప్లాట్లు నీళ్లలో మునిగే ఉన్నాయని.. నాలాను మూసేసి నీళ్లు వెళ్లకుండా చేయడమే ఇందుకు ప్రధాన కారమణమని ఆమె పేర్కొన్నారు. అయితే.. రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన కొన్ని అక్రమ కట్టడాలపై హైడ్రా ఇప్పటికే బుల్డోజర్ ఎక్కుపెట్టింది.