హైదరాబాద్: తెలుగు వారి లోగిళ్లలో పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. మూడు రోజుల పండుగలో తొలి రోజు భోగిని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు నేతలు తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ ప్రజలందరికి సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికి మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో అన్ని వర్గాలకు అంతా మంచి జరగాలన్నారు.
ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి. మీ వాంఛితాలన్నీ తీరి అత్యున్నత భోగాలు మీ సొంతం కావాలి. ప్రాకృతిక మార్పులతో సూర్యసంక్రమణ వేళ పీడలన్నీ వదిలి సర్వం భోగమయం కావాలనీ ఆ అమ్మవారిని కోరుకుంటూ హిందూ బంధువులకు భోగి పండుగ శుభాకాంక్షలు. – కేంద్ర మంత్రి బండి సంజయ్
ఈ భోగి మీ జీవితంలో.. భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
భోగి పండుగ మన అందరి జీవితాలలోకి భోగ భాగ్యాలని తీసుకురావాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ రోజున రంగుల ముగ్గుల్లాగా మన జీవితాలలో సంతోష హరివిల్లులు వెల్లువిరియాలి. కనుమ రోజు మనం కనే కలలన్నీ సాకారం చేయాలి. మనకి, ప్రకృతికి ఉన్న అవినాభవ సంబంధాన్ని సంక్రాంతి పండుగ గుర్తుచ్చేస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు అంటూ భగవంతుణ్ణి కోరుకుంటూ తెలుగు ప్రజలకు ఆమె భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.