రాక్షస బుద్ధితో ఉన్నవారితో యుద్ధం చేస్తున్నాం : సిఎం జగన్‌

పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుతగిలిన ప్రబుద్ధులు రాష్ట్రంలో ఉన్నారన్న జగన్

cm-ys-jagan-slams-chandrababu-pawan-in-venkatapalem-public-meeting

కృష్ణాయపాలెం: పేదవాడికి ఇల్లు రాకూడదని ప్రయత్నాలు చేసే దుర్మార్గమైన రాజకీయ పార్టీలను ఎక్కడా చూడలేదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా.. ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డుతగిలిన ప్రబుద్ధులు రాష్ట్రంలో ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, కొన్ని మీడియా సంస్థలు, వీళ్లకు తోడు చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు ఉన్నాయి” అని నిప్పులు చెరిగారు. సోమవారం గుంటూరు జిల్లాలోని కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. తర్వాత లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. పేదలందరికీ మరిచిపోలేనిదని అన్నారు. ‘‘పేదల శత్రువులపై పేదలు సాధించిన విజయం ఇది. ఇళ్లు కట్టిస్తానని గతంలో చంద్రబాబు మోసం చేశారు. పేదవాడికి ఇల్లు రాకూడదని అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరీ ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితి మరెక్కడా రాకూడదు” అని అన్నారు.

పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 కేసులు వేశారని జగన్ ఆరోపించారు. మూడేళ్లు ప్రజల కోసం తాము పోరాటం చేశామని, అందుకే ఇది పెత్తందారులపై పేదల ప్రభుత్వం సాధించిన విజయమని అన్నారు. రాక్షస బుద్ధితో ఉన్నవారితో యుద్ధం చేస్తున్నామని చెప్పారు. పేదవాడికి ఇంగ్లీష్‌ మీడియం అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు.. తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివిస్తారని మండిపడ్డారు. సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.