హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. జనవరి 14 నుంచి మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. జనవరి 14న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి.. 15, 16 తేదీల్లో అక్కడే ఉంటారు. ఈ నెల 15న ఢిల్లీలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అనంతరం ఈనెల 17న ఢిల్లీ నుంచి బయలుదేరి సింగపూర్కు వెళ్తారు. అక్కడ 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అలాగే, జనవరి 19న సింగపూర్ పర్యటన ముగించుకుని స్విట్జర్లాండ్లో దావోస్కు వెళ్లనున్నారు. ఈ నెల 23 వరకు దావోస్లో జరిగే 55వ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలిపింది.

ఇక, ప్రపంచ ఆర్దిక ఫోరం సదస్సుకు సీఎంతో పాటు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. గతేడాది కూడా సీఎం ఈ సదస్సుకు హాజరయ్యారు. దాదాపు రూ.40 వేల కోట్ల పెట్టబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్ుట ప్రభుత్వం ప్రకటించింది. ఇవి ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి.
ఈ ఏడాది పర్యటన గత ఒప్పందాల పురోగతి ఆధారంగా ముందుకెళ్తోందని భావిస్తున్నారు.. తెలంగాణ ప్రతినిధి బృందం ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలను ఆకట్టుకోడానికి వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 14న ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా.. కానీ అది అనివార్య కారణాలతో రద్దయినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం ఉన్న నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక, ఆస్ట్రేలియా పర్యటనలో బ్రిస్బేన్లోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సహా పలు ప్రాంతాలను సందర్శించి.. అక్కడ అత్యాధునిక క్రీడా మౌలిక సౌకర్యాలు, శిక్షణా విధానాలను పరిశీలించాల్సి ఉంది. కానీ, సీఎం విదేశీ టూర్ షెడ్యూల్ నుంచి ఆస్ట్రేలియా పర్యటనను తొలగించారు.