వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్

cm-revanth-reddy

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడి బాధితుల పరిస్థితిపై మంగళవారం ట్వీట్ చేశారు. ఎటుచూసినా గుండె కరిగిపోయే దృశ్యాలే కనిపించాయని, బాధితుల కష్టాలు చూసి మనసు చెదిరిపోయిందని చెప్పారు. వరద నీటిలో మునిగిపోవడంతో ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని, వారి కష్టాలను స్వయంగా చూశానని చెప్పుకొచ్చారు. బాధితుల ముఖాలలో ఓవైపు తీరని ఆవేదన, మరోవైపు అన్న వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు. వారి కష్టం తీర్చడానికి, వారి కన్నీళ్లు తుడవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతటి సాయానికైనా వెనకాడదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.