షాద్ నగర్ ఘటనపై డిప్యూటి సీఎం భట్టితో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy spoke to Deputy CM Bhatti about Shad Nagar incident

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు ఒక చోరీ కేసులో దళిత మహిళను స్టేషన్ కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తీవ్రంగా స్పందించారు. కేసు పూర్వాపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడారు. సీఎం రేవంత్ సూచనలతో వెంటనే స్పందించిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

డిప్యూటి సీఎం భట్టి ఆదేశాలతో సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి వెంటనే చర్యలు చేపట్టారు. ఒక సీఐ సహా ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ అవినాశ్ మహంతి. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో షాద్ నగర్ వంటి సంఘటనలను సహించబోమని డిప్యూటి సీఎం భట్టి .. పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి వైద్య సహాయంతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని సంబంధిత అధికారుల ద్వారా డిప్యూటి సీఎం భట్టి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన పోలీస్ అధికారులకు ఆయన సూచించారు.