ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని ఊహించలేదు: సీఎం రేవంత్‌

cm-revanth-reddy-speech-in-telangana-assembly

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సంతాపంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని తాను ఊహించలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య తండ్రి సాయన్న తనకు అత్యంత ఆప్తుడని, చాలా ఏళ్లు కలిసి పనిచేశామని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు.

కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లాస్య నందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్యనందిత చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వారు చేయాలనుకున్న పనలను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. లాస్య మృతికి సంతాపం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రేవంత్ పేర్కొన్నారు.

కాగా, ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.