రేపు కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమావేశం

CM Revanth Reddy

హైదరాబాద్‌ః సీఎం రేవంత్‌ రెడ్డి రేపు(శనివారం) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, ఆరోగ్యం (సీజనల్‌ వ్యాధులు), వన మహోత్సవం, మహిళా శక్తి పథకం, విద్య, శాంతి భద్రతల సంబంధిత అశాలు, డ్రగ్స్‌పై చర్చించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.

పన్నుల విసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ వరకు వచ్చిన ఆదాయం అంత అశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే, నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు.

నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై ఇకనుంచి ప్రతి నెలా మొదటివారంలో తానే సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, మైనింగ్‌, స్టాం పులు, రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో సీఎం ఏ రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ.. రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా, లీకేజీలను అరికట్టాలని సూచించా రు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది మరిం త ఆదాయం వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఆదాయ వనరులు, పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు నికచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రధాన ఆదాయ మార్గమైన జీఎస్టీ ఆదాయం పెంచుకోవడానికి కావల్సిన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. జీఎస్టీ రాబడి పెంపునకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పకడ్బందీగా ఆడిటింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, దానికి ప్రత్యామ్నయంగా ఏవియేషన్‌ ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.