అమెరికా పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy left for US tour

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శనివారం తెల్లవారుజామున అమెరికాకు బయలుదేరారు. వివిధ కంపెనీల సీఈవోలను ఆయన ఈ సందర్భంగా కలసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. సీఎం వెంట ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి సహా పలువురు అధికారులు ఉన్నారు. పెట్టుబడుల నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. 10 రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికాతో పాటు, ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

ముందుగా హైద‌రాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు. అక్క‌డ ఆరు రోజుల పాటు పలు సంస్థలతో భేటీ కానున్నారు. అక్క‌డి నుంచి నేరుగా ద‌క్షిణ కొరియా వెళ్తారు. అనంత‌రం అక్క‌డ ప‌ర్య‌ట‌న ముగించుకొని తిరిగి సీఎం బృందం ఈ నెల 14వ తేదీన ఉద‌యం హైద‌రాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. ఈ పది రోజుల ప‌ర్యాట‌న‌లో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 06 న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మిగతా ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది రేవంత్ టీమ్. ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచబ్యాంకు భాగస్వామ్యం చేయాలన్నది అసలు ఆలోచన

ఇందులో భాగంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా చర్చ‌లు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని అంత‌ర్జాతీయ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. వీరిలో ప్ర‌ముఖంగా అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కాగ్నిజెంట్‌ సీఈవో, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ సీవోవో, పెప్సీ కో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వారు ఉన్నారు. కాగా, తిరిగి సీఎం బృందం ఈ నెల 14వ తేదీన ఉదయం హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.