డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy

హైదరాబాద్‌: శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ డీజీపీ జితేందర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా రాజకీయ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే పనిలో ఉందని ఆరోపించారు.

తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో అన్నారు. కానీ కేసీఆర్ లక్కీ నెంబర్ తమ వద్ద ఉందని, కాబట్టి తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారన్నారు.