చచ్చిన పాము జగన్..అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

గత మూడు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా గడుపుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..ఏపీ సీఎం చంద్రబాబు , మాజీ సీఎం జగన్ ఫై పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లోని జగన్ ఇంటిముందు కూల్చివేతల గురించి తనకు ఎవరూ చెప్పలేదన్నారు. దీనిపై ఆరా తీస్తే ఓ నాయకుడు చెబితే అధికారులు అలా చేశారని తెలిసిందని… అందుకే వారిని సరెండర్ చేశామన్నారు. కానీ, చంద్రబాబు చెబితే తాను అలా చేశానని బయట ప్రచారం జరిగిందని… అది అవాస్తవమన్నారు. జగన్ చచ్చిన పాము అని… అలాంటి వ్యక్తి ఇంటి ముందు ఉన్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుందని ప్రశ్నించారు. అసలు తన ప్రధాన ప్రత్యర్థి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందే ఏవేవో కట్టుకున్నారని… వాటినే తీయలేదని… ఇక జగన్‌వి తాను ఎందుకు ముట్టుకుంటానన్నారు.

ఏపీ ప్రజలు జగన్‌కు 151 సీట్లు ఇస్తే పగ తీర్చుకోవడానికి ప్రయత్నించారని… అందుకే ప్రజలు తాజా ఎన్నికల్లో 11 సీట్లకు సరిపెట్టారన్నారు. హైదరాబాద్‌కు అమరావతి పోటీయే కాదన్నారు. హైదరాబాద్‌ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారని తాను భావించడం లేదన్నారు. అమరావతిలో లాభం ఉంటే మనం తాడుతో కట్టేసినా ఆగిపోరన్నారు. కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని భావించారని… కానీ ఆయనే తుడిచిపెట్టుకుపోయారని మండిపడ్డారు.