ఈరోజు ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యంతో సీఎం భేటి

CM meet with management of engineering colleges today

హైదరాబాద్‌ః నేడు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సీఎం భేటీ కానున్నారు. కాలేజీల యాజమాన్యాలతో జరిగే సమావేశంలో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపుపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ విద్య స్థితిగతులను బుర్రా వెంకటేశం సీఎంకు వివరించనున్నారు. ఒక మరోవైపు జూలై 16న కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. పాలన, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వనమహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై చర్చ నిర్వహించనున్నారు.

కాగా, నిన్న సచివాలయంలో హైడ్రాపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. హైడ్రా విధివిధానాలపై చర్చిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్‌, పోలీస్ విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం ఆలోచన. వర్షాకాలంలో విపత్తులు సంభవించే అవకాశం ఉన్నందున ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.