గుడివాడలో క్యాంటీన్ ప్రారంభించి ఆహారం వడ్డించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu started Anna canteen in Gudivada

అమరావతి: నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత గుడివాడ మునిసిపల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ ను ఆయన ప్రారంభించారు. అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి క్యాంటీన్ లో భోజనం వడ్డించారు. ఆపై తాము కూడా టోకెన్ తీసుకుని భోజనం చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం గుడివాడలో క్యాంటీన్ ప్రారంభం కాగా.. మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలు రూ.5 లకే కడుపు నింపుకోవచ్చని, ఇది బృహత్తర కార్యక్రమమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి బుధవారం రూ. కోటి విరాళం అందించిన విషయం తెలిసిందే.