తమ్ముడు మినిస్టర్ గా ప్రమాణస్వీకారం చేయడం గర్వంగా ఉంది – చిరంజీవి

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు పవన్‌ కల్యాణ్, మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక పవన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా ఫ్యామిలీలో , జనసేన శ్రేణుల్లో , మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. తన తమ్ముడు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. గుండెల నిండా సంతోషంగా ఉందని , రహస్త్రానికి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కలుగుతోందన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన, సుదీర్ఘ పాలన అందించే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకులు వచ్చారని కొనియాడారు. కొత్త, పాత కలయికలతోటి ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుందని కితాబిచ్చారు. కచ్చితంగా గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఇప్పుడు చూస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక తన తమ్ముడు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల గర్వంగా అనిపిస్తోందని చిరంజీవి తెలిపారు. ఎంతో కష్టపడ్డాక వచ్చిన విజయం ఇది అని అన్నారు.