తెలుగు రాష్ట్రాల బాధితులకు కదిలివస్తున్న చిత్రసీమ

తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకునేందుకు చిత్రసీమ కదిలివస్తుంది. తమకు తోచిన ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు, నిర్మాతలు , డైరెక్టర్లు సాయం ప్రకటించగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయిలు ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిచివేస్తున్నాయని ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు. అలాగే దర్శకుడు తల్లాడ సాయికృష్ణ భారీ వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రూ.1.5లక్షలు వితరణగా అందజేశారు. కన్నీరు మిగిల్చిన మున్నేరు ఖమ్మం ప్రజను తీరని వేదనకు గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా దాతృత్వం చాటుకున్న సాయి కృష్ణకు రెండు జిల్లాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ రూ.కోటి , మహేశ్ బాబు రూ. కోటి , హీరోయిన్ అనన్య నాగళ్ల రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షల సాయం , హీరో సందీప్ కిషన్ తన వంతుగా బాధితులకు ఆయన టీమ్ ఆహారాన్ని అందించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ‘ఆయ్‌’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున‌ విరాళం అందజేశారు.

నందమూరి బాలకృష్ణ కోటి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, ఎస్‌. రాధాకృష్ణ‌, ఎస్ నాగ‌వంశీలు సంయుక్తంగా త‌మ హారిక‌, హ‌సిని క్రియేష‌న్స్‌, సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ త‌రుపున ఆంద్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 ల‌క్ష‌లు, తెలంగాణ‌లకు రూ.25 ల‌క్ష‌ల చొప్పున మొత్తంగా రూ.50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షలు ప్రకటించారు. జూ. ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు ప్రకటించారు.