చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని విడిచి పెట్టిన పోలీసులు

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని శనివారం సాయంత్రం తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరి టిడిపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్‌రెడ్డిని బెంగుళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్‌ తర్వాత అప్పటి తెదేపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శనివారం రాత్రి దుబాయ్‌ వెళ్లబోతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో నిలువరించారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలో బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అనంతరం మోహిత్‌రెడ్డిని ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీయూ పీఎస్‌కు తీసుకొచ్చారు. కాసేపు విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు షరతులు విధించారు.