బిఆర్ఎస్ కు మరో షాక్..కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య

బిఆర్ఎస్ పార్టీ మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇటీవల మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో యాదయ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.

యాదయ్య కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎంపీపీ, జెడ్పీటీసీ గా పనిచేసారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటిచేసి టీడీపీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నం చేతిలో ఓడిపోయాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప బిఆర్ఎస్ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 781 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 33,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2023 ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు. ఇక ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరాడు.