వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శుక్రవారం ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. శనివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసిన విజయసాయిరెడ్డి రాజీనామా పత్రం సమర్పించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదన్న విజయసాయిరెడ్డి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ఎలాంటి ఒత్తిడి లేదని చెప్తున్నారు. వేరే పదవులు, ప్రయోజనాలు కూడా ఆశించడం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే వైసీపీలో అత్యంత కీలక స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కసారిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, రాజీనామా చేయడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దావోస్ పర్యటన విశేషాల గురించి చంద్రబాబు నాయుడు.. శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై చంద్రబాబును విలేకర్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.