Chandrababu : వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం నేడు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన లఘు చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ప్రణాళిక కింద రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి, ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా త్రిభాషా విధానంపై తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు.

త్రిభాషా విధానంపై చంద్రబాబు వ్యాఖ్యలు
చంద్రబాబు మాట్లాడుతూ త్రిభాషా విధానంలో ఎలాంటి తప్పులేదు అని స్పష్టం చేశారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమేనని, భావవ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనమని వివరించారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా మాత్రమే నాలెడ్జ్ పెరుగుతుందనడం తప్పుడు అభిప్రాయం. మాతృభాషలో విద్య అభ్యసించినవారే ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ స్థాయికి ఎదిగారు” అని అన్నారు. అలాగే, భాషలను ద్వేషించడం అనవసరమని పేర్కొన్నారు. మన మాతృభాష తెలుగు. హిందీ మన జాతీయ భాష. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. మన యువత ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం జపాన్, జర్మనీ, ఇతర దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆయా భాషలను నేర్చుకోవాలి. భాషలు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ప్రయోజనం” అని చంద్రబాబు అన్నారు.
తమిళనాడులో వ్యతిరేకత – ఏపీ సీఎం ప్రకటన ప్రాధాన్యం
త్రిభాషా విధానాన్ని తమిళనాడు వంటి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యా వ్యవస్థలో భాషలకు సంబంధించి ఏపీ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పొందనున్నాయి.