ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశమై కీలక విషయాలు వెల్లడించారు.తమ ప్రభుత్వం 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.గత పదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని తిరిగించేందుకు తమ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నప్పటికీ, పటిష్టమైన పాలనతో వాటిని అధిగమిస్తున్నామని సీఎం చెప్పారు.

ముఖ్యంగా రాజధాని లేని పరిస్థితి రాష్ట్ర రెవెన్యూ పై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.అందుకే ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేపట్టామని వివరించారు.ఇదే అంశాన్ని ఆర్థిక సంఘం సభ్యులకు వివరించేందుకు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. 2019 తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని సీఎం చెప్పారు.ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వివరించారు.తహసీల్దార్ కార్యాలయాల వరకు తాకట్టు పెట్టిన స్థితిని సీఎం గుర్తు చేశారు.పలు ఆస్తులను మద్యం ఆదాయానికి తాకట్టు పెట్టిన విధానం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు.గత 10 నెలల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు.పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. డెవలప్మెంట్, సంక్షేమం రెండింటినీ సమతుల్యంలో ఉంచేలా పాలన సాగుతోందని వివరించారు. కేంద్రం నుంచి అదనపు సహాయాన్ని కోరుతూ ఆర్థిక సంఘానికి వివరాలు సమర్పించారు.ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. “పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రాజెక్టు పూర్తి చేసి రాబోయే పుష్కరాలకు సిద్ధం చేస్తాం” అన్నారు.
ఈ ప్రారంభోత్సవానికి ఆయన్ను స్వయంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే దిశగా రాష్ట్రం తన వంతు పాత్రను పోషిస్తుందన్నారు.”జాబ్ ఫస్ట్” అనే నినాదంతో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. మొత్తానికి, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, ఇందుకు కేంద్రం సహకారం ఎంతో అవసరమని సీఎం పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కీలకంగా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.