చంద్రబాబు ఘాటు హెచ్చరిక: సోషల్ మీడియా దుర్వినియోగం సహించేది లేదు
ఏలూరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత జీవితాలను తిట్టడం, హక్కులపై దాడులు చేయడం, సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి వేదికగా మార్చడం వంటివి ఇకపై సహించబోమని ఆయన స్పష్టం చేశారు. “ఇలాంటి వ్యవహారాలు చేసే వారికి అదే చివరి రోజు అవుతుంది” అనే ఘాటైన వ్యాఖ్యతో ఆయన వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పాలన సమయంలో ప్రజలకు స్వేచ్ఛ లేని వాతావరణం నెలకొన్నదని, ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేందుకు తాము ముందుకు వచ్చామని చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తమ ప్రభుత్వానిదని, చట్టాన్ని అపహాస్యం చేసే వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడం, చంద్రబాబు వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చింది. రాజకీయాల్లో నైతిక విలువలపై చంద్రబాబు సూటిగా మాట్లాడడం విశేషం.
అసెంబ్లీ గౌరవాన్ని నిలబెట్టిన నేత
తాను గతంలో అసెంబ్లీలో అనుచిత పదజాలంతో దూషణలకు గురయ్యానని, అప్పట్లో “ఇది గౌరవ సభ కాదు” అని స్పష్టంగా చెప్పానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కౌరవ సభగా మారాకే తిరిగి అడుగుపెడతానని అప్పుడే సంకల్పించానని తెలిపారు. “ఆడపిల్లల వ్యక్తిత్వాలపై చెడుగా మాట్లాడితే నేను ఊరుకోను” అని తీవ్రంగా హెచ్చరించారు.
బీసీ వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
మహాత్మా జ్యోతిరావు పూలే స్పూర్తితో బీసీలకు ప్రత్యేక సంరక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగాల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. జిల్లాల వారీగా బీసీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు.
బీసీల శిక్షణ కోసం రాజధాని అమరావతిలో ప్రత్యేకంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇది వారికి అవకాశాలను కల్పించడమే కాకుండా, ఉన్నత స్థాయిలో సేవలందించేందుకు మార్గం తీసుకురానుంది.
పెన్షన్ పథకంలో విప్లవాత్మక మార్పులు
దేశంలో ఎక్కడా లేనంతగా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వృద్ధుల, వికలాంగుల, మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇది మహిళా సాధికారత వైపు తీసుకెళ్లే గొప్ప ముందడుగుగా నిలుస్తుంది.
రైతులకు ధైర్యం, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం
రైతుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మే నెల నుంచి రైతులకు విడతల వారీగా రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వివరించారు. లాభదాయకమైన వాణిజ్య పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇదే సమయంలో, చింతలపూడి ప్రాజెక్టు కోర్టు సమస్యలు పరిష్కరించి త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.
పీ–4తో కొత్త రాజకీయ దిశ
పీ-4 అనే సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంపద ఒక్కరికి పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో, 10 మంది సంపన్నులు 20 మంది పేదలకు చేయూతనివ్వాలన్నదే తమ అభిమతమని వివరించారు. ఆగిరిపల్లిలో 206 పేద కుటుంబాలను గుర్తించి, వారికి స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామని వెల్లడించారు.
READ ALSO: Gorantla Madhav: గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసు