ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. భవిష్యత్తు టెక్నాలజీలకు అత్యాధునికంగా నిలవనున్న “క్వాంటం వ్యాలీ” స్థాపన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ చారిత్రక ప్రక్రియలో ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టి (L&T) వంటి దేశీయ, టెక్ దిగ్గజాలు భాగస్వాములయ్యాయి.

ఉండవల్లిలో అవగాహన ఒప్పందాలు
ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోఈ సమావేశాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలకు హాజరయ్యారు. ఈ ఒప్పందాలు కేవలం అభివృద్ధికి మార్గదర్శకాలు కాక, భారతదేశాన్ని గ్లోబల్ క్వాంటం మ్యాప్పై నిలబెట్టే శక్తివంతమైన అడుగులుగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఐబీఎం, అత్యాధునిక 156-క్యూబిట్ సామర్థ్యం గల ‘క్వాంటం సిస్టం 2’ ను అమరావతిలో నెలకొల్పనుంది. ఇది 2026 జనవరి 1 నాటికి కార్యరూపంలోకి వస్తుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యవస్థకు హెరాన్ ప్రాసెసర్ అనే అత్యాధునిక చిప్ ఆధారంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అగ్రశ్రేణి క్వాంటం కంప్యూటింగ్ మోడల్స్లో ఒకటి.
అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో ఐటీ విప్లవానికి ఏపీ ఊతమిచ్చినట్లే, ఇప్పుడు క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “ఇది ఏపీకే కాదు, దేశానికే చారిత్రక దినం” అని ఆయన అన్నారు. భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు క్వాంటం కంప్యూటింగ్ పునాది అవుతుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలన్నారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవంతో, దీన్ని కూడా వేగంగా పూర్తి చేస్తామని, ఎల్&టీకి ఇప్పటికే స్థలం కేటాయించామని తెలిపారు. పనుల పర్యవేక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
కమిటీలు, పర్యవేక్షణ
ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగేందుకు రెండు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఒకటి నిర్మాణ పనుల పర్యవేక్షణ కమిటీ, మరొకటి శాస్త్రీయ, పరిశోధనా అంశాల సమన్వయ కమిటీ. L&T నిర్మాణానికి ఇప్పటికే ప్రాథమిక నమూనాలు సమర్పించినట్లు సమాచారం. భారత్లో ఐబీఎం క్వాంటం సిస్టం 2ను స్థాపించడం దేశ క్వాంటం ప్రయాణంలో కీలక మలుపు అని ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా అన్నారు. ఈ భాగస్వామ్యం క్వాంటం అల్గారిథమ్ల అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. క్వాంటం, క్లాసికల్ వ్యవస్థల అనుసంధానంతో జీవశాస్త్రం, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పరిశోధన, అభివృద్ధికి ఊతం లభిస్తుందని టీసీఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Read also: Narendra Modi: భారీ భద్రత మధ్య సభ ప్రాగణం చేరుకున్న మోదీ