విదేశీ పర్యటన ముగించిన చంద్రబాబు.. ఢిల్లీ పర్యటనలో కీలక సమావేశాలు
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చర్చ జరిపారు. రాష్ట్ర ప్రగతిలో నీటి ప్రాజెక్టుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొంటూ, కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
పోలవరం ప్రాజెక్టుకు నిధులు.. లక్ష్యంగా 2027
సీఎం చంద్రబాబు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును ఎప్పటికప్పుడు ముందుకు నడిపించడంపై దృష్టి సారించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు పురోగతికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి కేవలం నీటి పారుదల కోణంలో మాత్రమే కాదు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక రంగాల్లో అమూల్యమైన సేవలు అందించనుందని ఆయన వివరించారు. అంతేకాకుండా, ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఒకసారి క్షేత్రస్థాయిలో సందర్శించాల్సిందిగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. దీనిపై సానుకూల స్పందన లభించినట్లు సమాచారం.
రాయలసీమ నీటి అవసరాలకు బనకచర్ల ప్రాజెక్టు కీలకం
ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించడంలో కీలకమైన బనకచర్ల ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గోదావరి వరద జలాలను పోలవరం ద్వారా తరలించి, పెన్నా నదితో అనుసంధానించే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని నీటి కష్టాలను పరిష్కరించవచ్చని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం, అవసరమైన ఆర్థిక సహాయం అందించడం వల్ల రాష్ట్రంలోని విస్తారమైన భూభాగానికి సాగు నీరు లభించే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా ఒప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు, బనకచర్ల ప్రాజెక్టు అమలుతో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి మార్గం సాఫీ అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
READ ALSO: Sajjala Ramakrishna Reddy: వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి