ఏపీలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీకి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పలు అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఇబ్బందులు మొదలయ్యాయి.తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఏబీకి వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. కోర్టులో ఊరట లభించినా తిరిగి సస్పెండ్ చేసింది. దీంతో సస్పెన్షన్ కాలంలో ఆయనకు చెల్లించాల్సిన జీత భత్యాల్ని కూడా నిలిపేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జీత భత్యాలు చెల్లించాల్సి ఉంది. అయినా వీటిని చెల్లించకుండా ఆలస్యం చేశారు.

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో జరిగిన తప్పిదాలను సవరించడం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయనపై గత వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాల్ని కూటమి సర్కార్ ఉపసంహరించుకుంది. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన రెండుసార్లు సస్పెండ్ అయిన కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు అప్పట్లో సస్పెన్షన్ కాలంలో బకాయి ఉన్న జీత భత్యాల్ని చెల్లించబోతున్నారు.