అల్లు అర్జున్ కాళ్లు మొక్కకపోతే.. పుష్ప-2ను అడ్డుకుంటాం – జనసేన నేత

పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ గెలుపునకు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, అల్లు అర్జున్ నంద్యాలలో తన మిత్రుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి గెలుపునకు ప్రచారం చేశారు. అప్పటి నుండి అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీని కించపరిచేలా అల్లు అర్జున్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ రగిలిపోయారు.

ఇదిలా ఉంటె హీరో అల్లు అర్జున్ సంస్కార హీనుడంటూ జనసేన నేత చలమలశెట్టి రమేశ్ ధ్వజమెత్తారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలమలశెట్టి రమేశ్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అల్లు అర్జున్ .. నీవు హీరో ననుకుంటున్నావా.. కమేడియన్ వి మాత్రమే. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు’ అంటూ రమేశ్ మండిపడ్డారు.

‘చిరంజీవి భావితరాలకు ఆదర్శప్రాయుడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏంటి? ఆ కుటుంబంపై ఇష్టారీతిన మాట్లాడితే సహించం. తన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి.. ఆ నీటిని ఆయన నెత్తిపై చల్లుకోవాలి. లేదంటే పుష్ప-2 సినిమాను మా నియోజకవర్గంలో అడ్డుకుంటాం’ అని హెచ్చరించారు.