రేపు తెలంగాణకు కేంద్ర బృందం

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల్లో రేపు కేంద్ర బృందం పర్యటించనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఖమ్మం, మహబూబాబాద్ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తుందన్నారు. ఆ నివేదికను బట్టి కేంద్రం త్వరగా సాయం చేసేందుకు కృషి చేయనుందని వెల్లడించారు.

ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. మున్నేరు అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో రూ.417.69 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికార యంత్రాంగం ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదించింది. జిల్లాలో వరదల ధాటికి ఆరుగురు మృతిచెందినట్లు , బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సర్కారు పరిహారం అందజేసింది.