అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో భారత్.. ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటోంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. అమెరికాలో నివసిస్తోన్న అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠిన వైఖరిని అవలంభిస్తోండటమే దీనికి ప్రధాన కారణం. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పౌరులపై గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. గత ఏడాది ఆగస్టులో ఎన్నికల ప్రచార సమయంలో ఎలాన్ మస్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికాలో 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తోన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్లందరినీ కూడా వెనక్కి పిలిపించుకోవాలని భావిస్తోంది. దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించబోతోంది త్వరలోనే.

అక్రమ వలసదారులను రాడికల్స్గా, టెర్రరిస్టులుగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్లు అమెరికా గడ్డపై నివసించడానికి ఏ మాత్రం అర్హులు కారనీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి అప్పట్లో. ఇప్పుడు దాన్ని చేతల్లో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా- అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసి పడేశారు. నాన్ అమెరికన్లకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికారు. ట్రంప్ చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం అమెరికాతో కొనసాగుతున్న దౌత్య, వాణిజ్య పరమైన సంబంధాలేవీ కూడా అక్రమ వలసల వల్ల దెబ్బ తినకూడదనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు.