ఎన్నికల సమయానికి ఏపీ వెంటిలేటర్ పై ఉందని, కేంద్రం ఆక్సిజన్ ఇవ్వడంతో బయటపడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అమరావతికి రూ.15వేల కోట్లు ఇచ్చారు. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి. 2027 ఏప్రిల్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
విశాఖ ఉక్కుకు రూ.11,400 కోట్ల ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలి’ అని కోరారు. గత ఎన్నికల్లో 93 శాతం స్ట్రయిక్ రేట్ తో ఏపీలో ఘనవిజయం సాధించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు ఉందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీతో ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారని చంద్రబాబు కొనియాడారు. ఇటీవల విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలని ఆకాంక్షించారు.