అల్లు అర్జున్, శ్రీలీలపై తాజాగా మరో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్ ) ఆ ఫిర్యాదు చేసారు. ఈ కేసులో అల్లు అర్జున్తో పాటు హీరోయిన్ శ్రీలీల పేరు కూడా ప్రస్తావించబడింది.ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, అల్లు అర్జున్, శ్రీలీల కొంతమంది కార్పొరేట్ కళాశాలల బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయా కళాశాలల విద్యా ప్రమాణాలు, విద్యా విధానాలు పూర్తిగా తెలుసుకోకుండా, తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రకటనల వల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టే అవకాశముందని తెలిపారు.వీరి యాడ్స్ కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బన్నీ, శ్రీలీలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
ప్రమోట్
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియేట్, ఐఐటి-జెఈఈ ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఎప్పటిలాగే పలు ప్రముఖ విద్యాసంస్థలు జనాలను ఆకర్షించడానికి, తమ కాలేజిలో చదివిన వారికే టాప్ ర్యాంక్స్ వచ్చాయంటూ పోటాపోటీగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాయి. ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ తమ పేపర్ యాడ్ లో అల్లు అర్జున్, శ్రీలీల ఫోటోలను కూడా ముద్రించారు. దీనిపై ఏఐఎస్ఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలు విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ, ఆ కాలేజీలలోనే మెరుగైన విద్య లభిస్తుందని, అక్కడే జాయిన్ అవ్వాలని ప్రమోట్ చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ పేర్కొంది.విద్యార్థులు , వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. వీరి మాటలు విని ఆ కాలేజీల్లో చేరిన విద్యార్థులు, తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో హాస్టల్స్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లక్షలు పొందడం లక్ష్యమైతే, లక్షలాది మంది జీవితాలను నాశనం చేస్తున్న శ్రీలీల, అల్లు అర్జున్ లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.

జాగ్రత్తగా
కార్పొరేట్ కాలేజీలు నిబంధనలు పట్టించుకోకుండా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని, అలాంటి కళాశాలలో చేరమని ప్రమోషన్స్ చేయడం సరికాదని అన్నారు. ప్రకటనలో ఇస్తున్న ర్యాంకులు నిజంగానే ఆ కాలేజీ స్టూడెంట్స్ కి వచ్చాయా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ప్రమోట్ చేస్తున్నారని, ఎక్కడో నార్త్ లో వచ్చిన ర్యాంకులను తమ విద్యాసంస్థలకు వచ్చినట్లుగా చూపిస్తున్నారని, ఇలాంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. మరి దీనిపై అల్లు అర్జున్, శ్రీలీల ఎలా స్పందిస్తారో చూడాలి.సెలబ్రిటీలు ఏదైనా బ్రాండ్ ని ప్రచారం చేయాలన్నా, కమర్షియల్ యాడ్స్ చేసే విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. హీరో హీరోయిన్లు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ మీద సైన్ చేసే ముందే, దాని గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాలు వారిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు కాబట్టి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే కేసులు, కోర్టులు అంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.
Read Also: NTR: ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మూవీ నుండి బిగ్ అప్డేట్!