సింగర్‌ మనో కుమారులపై పోలీస్ కేసు

ప్రముఖ సింగర్ మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్ధి వళసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్‌లతోపాటు వారి స్నేహితులు మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు.

ఈ ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్‌తోపాటు మరో16 ఏళ్ల బాలుడితో గొడవపడ్డారు. గొడవ ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్‌ కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వళసరవాక్కం పోలీసులు సింగర్‌ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్‌ పై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వల్సరవాక్కం పోలీసులు విఘ్నేష్, ధర్మను అరెస్ట్ చేశారు.