అమరావతి: ఏపీ ఫైబర్నెట్కు సంబంధించి ఛైర్మన్ జీవీ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం కొంతమంది కేబుల్ ఆపరేటర్లకు విధించిన రూ.100 కోట్లు పెనాల్టీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా సెటప్ బాక్స్ అద్దె కింద కేబుల్ ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్కు నెలకు రూ.59 చొప్పున వసూలుచేస్తున్న విధానాన్ని కూడా వెనక్కు తీసుకున్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు తక్కువ ధర (బేసిక్ ప్యాకేజీ ధర)కు ఫైబర్ నెట్ సేవలు అందించేందుకుప్లాన్లను సవరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా , అక్రమంగా ఎంతోమంది ఉద్యోగులను నియమించారని.. మరో 200 మందిని ఉద్యోగులను తొలగించామని జీవీ రెడ్డి చెప్పారు.
ఫైబర్ నెట్కు సంబంధించి ఇప్పటి వరకు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 600కు చేరిందన్నారు జీవీ రెడ్డి. తమ ప్రభుత్వ హయాంలో పారదర్శక విధానంలో ఉద్యోగాల నియామకాలు చేపడతామని.. త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి సమర్థత, అర్హత ఉన్నవారికే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్నెట్లో అవినీతి, అక్రమాలు జరిగాయని.. ఈ మేరకు విచారణ చేపడతామన్నారు. అంతేకాదు జిల్లాల్లో నెట్వర్క్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లపై అనేక ఆరోపణలు వచ్చాయని.. వీరిలో 50% మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఫైబర్ నెట్ ఛైర్మన్ తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలకు రాయితీపై ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్లు ఇస్తామన్నారు జీవీ రెడ్డి. అంతేకాదు తిరుమల కొండపై ఉన్న అన్ని ఆఫీస్లు, ఇళ్లు, షాపులకు ఉచితంగా ఏపీ ఫైబర్నెట్ కనెక్షన్లు అందిస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి కొత్త సెటప్ బాక్సులను అందుబాటులోకి తెస్తామని.. రాష్ట్రంలో కనెక్షన్ల సంఖ్యను పెంచే దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కొత్త సెటప్ బాక్సులకు రూ.2,500 కోట్లు కావాలని.. ఈ నిధుల్ని వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటామన్నారు. తాము రాజకీయాల కోసం ఆరోపణలు చేయడం లేదని.. పక్కా ఆధారాలతో అవినీతి, అక్రమార్కులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాము అన్నారు.
గత ప్రభుత్వం ఫైబర్ నెట్ను రూ. 900 కోట్ల నష్టాలు, రూ.1260 కోట్లు అప్పులు మిగిల్చింది అన్నారు జీవీ రెడ్డి. ఎన్ని ఇబ్బందులున్నా సరే ప్రజలకు తక్కువ ధరకే ఫైబర్ నెట్ను ప్రజలకు అందిస్తామన్నారు జీవీ రెడ్డి. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రైవేటు వారితో పోలిస్తే సగం ధరలకే నాణ్యమైన సేవలను అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని.. మంత్రి లోకేష్ కూడా విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని ప్రశంసించారు.